Allari Naresh: మరో కొత్త దర్శకుడితో అల్లరి నరేశ్!

  • ఆగిపోయిన 'సభకు నమస్కారం'
  • కొత్త ప్రాజెక్టుకు అల్లరి నరేశ్ గ్రీన్ సిగ్నల్  
  • దర్శకుడిగా రాజ్ మోహన్ పరిచయం
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
Allari Naresh in Raj Mohan Movie

అల్లరి నరేశ్ హీరోగా ఆ మధ్య వచ్చిన 'నాంది' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'సభకు నమస్కారం' పట్టాలెక్కించాడు. సతీశ్ మల్లంపాటి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను నిర్మాత మహేశ్ కోనేరు సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు.

అయితే మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో అల్లరి నరేశ్ మరో సినిమాను మొదలెట్టేశాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా రాజ్ మోహన్ పరిచయమవుతున్నాడు.

అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. తెలుగు అమ్మాయి అయిన ఆనంది, తమిళంలో బాగా పాప్యులర్ అయింది. 'శ్రీదేవి సోడా సెంటర్' తరువాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇదే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

More Telugu News