యూపీలో అఖిలేశ్ పై కేంద్రమంత్రితో పోటీ చేయిస్తున్న బీజేపీ
- అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్
- ప్రధానంగా బీజేపీ, సమాజ్ వాదీ మధ్య పోటీ
- కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ పోటీ
- బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్
గతంలో ఎంపీగా పార్లమెంటుకు వెళ్లిన అఖిలేశ్ ఈ ఎన్నికల ద్వారా అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కూడా కర్హాల్ లో పోటీ చేస్తుండడంతో పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. బఘేల్ ప్రస్తుతం ఆగ్రా ఎంపీగా ఉన్నారు.
అఖిలేశ్ నేడు కర్హాల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై బీజేపీ ఎవరిని బరిలో దించినా వారు ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఒక్క చాన్స్ అంటూ ప్రచారం చేసిన తరహాలో, యూపీలో సమాజ్ వాదీ పార్టీ కూడా ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారం చేస్తోంది. దుష్ట రాజకీయాలకు ముగింపు పలికి, యూపీని పురోగామి పథంలో నడిపిస్తామని అఖిలేశ్ హామీ ఇస్తున్నారు.