Devineni Uma: అందుకే వైసీపీ నేత‌లు బూతులు తిడుతున్నారు: దేవినేని ఉమ‌

  • గోవా సంస్కృతిని బూతుల మంత్రి గుడివాడ‌కు తీసుకొచ్చారు
  • పండుగ‌కు బ‌ట్ట‌లు కొనుక్కునే స్తోమ‌త కూడా ప్ర‌జ‌ల‌కు లేదు
  • ఇసుక ర‌వాణా వ‌ల్ల ఎంత ఆదాయం వ‌చ్చింది
  • ఇవ‌న్నీ మేము అడుగుతుంటే వైసీపీ నేత‌ల‌కు కోపం వ‌స్తోంది
devineni slams ycp

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా అబద్ధాల మయమ‌ని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌రరావు మండిప‌డ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... గ్రామాల్లో సంక్రాంతి క‌ళే లేకుండా పోయింద‌ని చెప్పారు. క‌నీసం కొత్త బ‌ట్ట‌లు కొనుక్కునే ప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌లు లేర‌ని అన్నారు.

క్యాసినో వ‌ల్ల కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయ‌ని చెప్పారు. క్యాసినో నిర్వ‌హించి గ‌తంలో దొరికిపోతే ఓ కేబినెట్ మంత్రి గ‌తంలో ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, ఫైన్ క‌డ‌తామ‌ని మ‌ళ్లీ క్యాసినో నిర్వ‌హిస్తామ‌ని చెప్పార‌ని దేవినేని ఉమ అన్నారు. ఇప్పుడు చెప్పిన‌ట్లే గోవా సంస్కృతిని ఆ బూతుల మంత్రి గుడివాడ‌కు తీసుకొచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం స‌మాధానం చెబుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి అండ‌దండ‌ల‌తోనే క్యాసినో సంస్కృతి కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. తాము గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు ఇరిగేష‌న్ రంగం అభివృద్ధి కోసం కృషి చేశామ‌ని, దాని ద్వారా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించామ‌ని చెప్పారు.

ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం గుడివాడ‌లో క్యాసినో నిర్వ‌హిస్తే రూ.500 కోట్లు వ‌చ్చాయ‌ని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తే ఎన్ని వంద‌ల కోట్ల రూపాయ‌లు వ‌స్తాయో ఆలోచిస్తున్నార‌ని దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఆరోపించారు. ఈ రాష్ట్రం ఎటుపోతోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఇసుక మీద వ‌చ్చిన ఆదాయం ఎంత‌ని, ప్ర‌భుత్వానికి ఎంత జ‌మ చేశార‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇవ‌న్నీ అడుగుతున్నామ‌ని త‌మ నేత‌ల‌ను వైసీపీ నేత‌లు బూతులు తిడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

  • Loading...

More Telugu News