Anitha: ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నేతల హస్తం ఉంటోంది: టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత

  • మైనర్ బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతుండటం దారుణం
  • సుచరిత నిస్సహాయశాఖ మంత్రిగా మారిపోయారు
  • బలహీనవర్గాల మహిళలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు
Anitha fires on Jagan

ముఖ్యమంత్రి జగన్ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు విలువే లేకుండా పోతోందని టీడీపీ నాయకురాలు అనిత విమర్శించారు. మైనర్ బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతుందడం దారుణమని అన్నారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగి రెండు నెలలు గడుస్తున్నా... బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఆ చిన్నారిపై కన్నా భూశంకర్ అనే వైసీపీ నాయకుడు అత్యాచారం చేశాడని చెప్పారు. హోంశాఖ మంత్రి సుచరిత నిస్సహాయ శాఖ మంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు.
 
రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నేతల హస్తం ఉంటోందని అనిత ఆరోపించారు. అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు వస్తే... అక్కడ ఆ అమ్మాయి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని పోలీసులను కోరుతున్నామని చెప్పారు.

బలహీనవర్గాలకు చెందిన మహిళలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకపోయినా డ్రగ్స్, గంజాయి మాత్రం వచ్చాయని అన్నారు. జగన్ కు మహిళలు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే వస్తుందని చెప్పారు.

More Telugu News