Rajamouli: ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ రాజమౌళి పిలుపు

  • బ్లడ్ కేన్సర్ బారిన పడిన దేవిక
  • ఆమెతో కలసి బాహుబలి కోసం పనిచేశా
  • ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె సేవలు
  • కెట్టో ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విరాళం ఇవ్వండి
Rajamouli humbly request to donate funds to the Ketto Campaign

ఒక సహ కళాకారిణి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుండడం ప్రముఖ దర్శకుడు రాజౌమళిని కలచి వేసింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. తనతో కలసి ఎన్నో సినిమాలకు పనిచేసిన ఆమె కోసం సాయానికి పిలుపునిచ్చారు.

‘‘బాహుబలి సినిమా కోసం దేవికతో కలసి పనిచేశాను. ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు (నిర్మాణానంతర పనులు) ఆమె కోర్డినేటర్ గా పనిచేశారు. ఆమె అభిరుచి, అంకిత భావం నిజంగా సాటిలేనివి. కానీ, దురదృష్టవశాత్తూ బ్లడ్ కేన్సర్ తో పోరాటం చేస్తున్నారు.

నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెట్టో ఫండ్ రైజింగ్ (నిధుల సమీకరణ) కార్యక్రమానికి మీ వంతుగా సాయం చేయాలని సవినయంగా కోరుతున్నాను’’ అంటూ రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఇదే పోస్ట్ లో దేవిక తన భర్త, ఇద్దరు పిల్లలతో  కలసి తీసుకున్న ఫొటోను కూడా ఉంచారు.

ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టగా.. కొందరు అయితే ‘మీరు రూ.800 కోట్లు సంపాదించారుగా.. (బాహుబలి సినిమా) మీరు ఎందుకు సాయం చేయరు?’అంటూ ప్రశ్నించారు. ‘మీరు తప్పకుండా కావాల్సినంత సమకూరుస్తారని ఆశిస్తున్నాను’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. కాకపోతే ఎక్కువ మంది యూజర్లు రాజమౌళియే పెద్ద మనసుతో సాయం చేసి ఆదుకోవచ్చుగా! అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

More Telugu News