Goa: అలా జరిగితే.. గోవా అసెంబ్లీలో నాలుగోవంతు భార్యాభర్తలతో నిండిపోతుంది!

  • గోవా ఎన్నికల బరిలో ఐదు జంటలు
  • రెండు జంటలకు బీజేపీ టికెట్
  •  వీరందరూ గెలిస్తే అదో రికార్డు
5 Couples to check their luck in goa assembly elections

వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండడంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నప్పటికీ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇక, గోవాను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ క్రమంలో గోవాలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈ ఎన్నికల్లో మొత్తం ఐదు జంటలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీరిలో రెండు జంటలకు బీజేపీ టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ ఒకటి, తృణమూల్ కాంగ్రెస్ ఒక జంటకు టికెట్లు ఇచ్చింది. మరొకరు బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా,  ఆయన భార్య స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల క్షేత్రంలోకి దిగారు.

రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె వాల్‌పోయ్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగగా, ఆయన భార్య దేవియా.. పోరియెం నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలో నిలిచారు. అలాగే, అటనాసో మాన్సరెట్- జెన్సిఫర్ దంపతులను పనాజీ, తాలెయిగావో స్థానాల నుంచి బరిలోకి దింపింది. ఇక, ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్ బీజేపీ టికెట్‌పై క్యూపెమ్ నుంచి బరిలో ఉండగా, ఆయన భార్య సావిత్రి కవ్లేకర్ సాంగెం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి మైఖేల్ లోబో-డెలీలాహ్ దంపతులు కలంగుట్, సియోలిమ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, తృణమూల్ పార్టీ.. కిరణ్ కందోల్కర్-కవిత దంపతులను పోటీలో నిలిపింది. ఈ ఎన్నికల్లో వీరందరూ గెలిస్తే 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో నాలుగో వంతు భార్యాభర్తలతోనే నిండిపోతుంది. అప్పుడు అదో రికార్డు అవుతుంది.

More Telugu News