Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై ముంబైలో కేసు నమోదు!

  • సుందర్ పిచాయ్ పై బాలీవుడ్ నిర్మాత సునీల్ దర్శన్ ఫిర్యాదు
  • తన సినిమాను అనధికారికంగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారన్న సునీల్
  • తన హక్కులకు విఘాతం కలిగిందని వ్యాఖ్య
Mumbai police filed case against Google CEO Sundar Pichai

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్ చట్టం సెక్షన్లు 51, 63, 69 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ దర్శన్ ఫిర్యాదు మేరకు సుందర్ పిచాయ్, యూట్యూబ్ కు చెందిన గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. 2017లో విడుదలైన 'ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా' చిత్రానికి సంబంధించి కేసును నమోదు చేశారు.

ఈ సందర్భంగా సునీల్ దర్శన్ ఓ వెబ్ సైట్ తో మాట్లాడుతూ... తన సినిమాను యూట్యూబ్ లో అనధికారికంగా అప్ లోడ్ చేశారని... దాన్ని గూగుల్ అనుమతించిందని చెప్పారు. ఈ విషయంపై ఈమెయిల్ ద్వారా వారిని పలుమార్లు సంప్రదించినప్పటికీ వారి నుంచి సమాధానం రాలేదని తెలిపారు. అందుకే చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

 గూగుల్, యూట్యూబ్ టెక్నాలజీపై తనకు ఎంతో గౌరవం ఉందని... అయితే తన హక్కులకు విఘాతం కలిగిందని అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకురావడానికే పోలీసులకు ఫిర్యాదు చేశానని... న్యాయ వ్యవస్థకు తన కృతజ్ఞతలు అని చెప్పారు.

More Telugu News