Shilpa Shetty: ‘బహిరంగ ముద్దు’ కేసు నుంచి శిల్పా శెట్టికి విముక్తి!

  • ఆమె ఇక్కడ బాధితురాలన్న న్యాయమూర్తి 
  • సహ నటుడి చర్యను అడ్డుకోకపోవడం నేరం కాదు
  • ఆమెపై అభియోగాలు ఆధార రహితమన్న కోర్టు 
  • శిల్పాశెట్టికి కేసు నుంచి విముక్తి
Shilpa Shetty get relief in obscenity case

బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు నుంచి బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టికి ఊరట లభించింది. 2007లో రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ ప్రచార కార్యక్రమం సందర్భంగా హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరే.. శిల్పాశెట్టిని వేదికపైనే కౌగిలించుకోవడం, ఆ తర్వాత వరుస ముద్దులు ఇవ్వడం తెలిసిందే. ఆ సమయంలో శిల్పాశెట్టి వద్దంటున్నా గెరే రెచ్చిపోయి ఆ పని చేసినట్టు వీడియో చూస్తే తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి శిల్పాశెట్టి, రిచర్డ్ గెరేకు వ్యతిరేకంగా రెండు కేసులు నమోదయ్యాయి. అశ్లీలత, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు అభియోగాలు మోపారు. 15 ఏళ్ల తర్వాత ఈ కేసు కొలిక్కి వచ్చింది. తొలుత రాజస్థాన్ లో నమోదైన కేసులను శిల్పాశెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీ చేసేందుకు లోగడ సుప్రీంకోర్టు అనుమతించింది.

ఈ వివాదంలో శిల్పాశెట్టిని బాధితురాలిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేతకి చవాన్ అభివర్ణించారు. నాడు ఘటన జరిగిన వెంటనే శిల్పాశెట్టి దీనిపై స్పష్టతనిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శిల్పాశెట్టికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అభియోగాలు ఆధారరహితమని పేర్కొంటూ కొట్టి వేశారు.

మొదటి నిందితుడు (రిచర్డ్ గెరే) చేసిన పనికి శిల్పాశెట్టి బాధితురాలిగా మారినట్టు మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. ‘‘సహ నటుడు ముద్దు ఇస్తుంటే అడ్డుకోనందున ఆమెను కుట్రదారు, నేరస్థురాలు అని చెప్పడానికి లేదు’’ అని మేజిస్ట్రేట్ స్పష్టం తీర్పు చెప్పారు. 

More Telugu News