ICC: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. భారత్ చేజారిన తొలి ర్యాంకు!

  • మూడో స్థానానికి జారిన భారత్ 
  • 1–2తో సిరీస్ ఓడిన ఫలితం
  • 2 స్థానాలు ఎగబాకి తొలి ర్యాంకు సాధించిన ఆస్ట్రేలియా
  • 4–0 తేడాతో యాషెస్ గెలవడంతో ఫస్ట్ ర్యాంక్
  • రెండో స్థానంలోనే కొనసాగుతున్న కివీస్
India Loses 2 Spots In Test Rankings Down To 3rd Spot

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ర్యాంకు దిగజారింది. ఇప్పటిదాకా ఉన్న తొలి ర్యాంకు చేజారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 1–2తో కోల్పోవడం, యాషెస్ సిరీస్ లో 4–0 తేడాతో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా మట్టికరిపించడంతో భారత్ ర్యాంకు పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో భారత్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా రెండు స్థానాలు ఎగబాకి ఫస్ట్ ర్యాంకును దక్కించుకుంది.

119 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. సెంచూరియన్ లో జరిగిన ఫస్ట్ టెస్టులో భారీ విజయం సాధించిన భారత్.. ఆ తర్వాత జొహెన్నస్ బర్గ్, కేప్ టౌన్  టెస్టుల్లోనూ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సిరీస్ ను గెలిచిన దక్షిణాఫ్రికా 101 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. 117 పాయింట్లతో టెస్ట్ చాంపియన్స్ న్యూజిలాండ్ రెండో స్థానాన్ని కాపాడుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన కివీస్.. ఆ తర్వాత హేగ్లీలో జరిగిన టెస్టులో గెలిచింది.

ఇక, పాకిస్థాన్ ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ర్యాంకును సాధించింది. ఆ జట్టుకు 93 పాయింట్లున్నాయి. శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ లు తమ తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి.

More Telugu News