Tanuja: గుంటూరులో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.. విజయవాడలో విగతజీవిగా కనిపించిన వైనం!

  • ఆదివారం ఇంటి నుంచి అదృశ్యమైన తనూజ
  • రోడ్డు ప్రమాదం కాదని నిర్ధారించిన పోలీసులు
  • మరణం చుట్టూ అల్లుకున్న అనుమానాలు
Software employee died in vijayawada who missing from guntur home

గుంటూరులో ఆదివారం ఇంటి నుంచి అదృశ్యమైన సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగిని తనూజ నిన్న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విగతజీవిగా కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తనూజకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన మణికంఠతో వివాహమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. కరోనా నేపథ్యంలో గుంటూరు వచ్చిన వారు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి తనూజ అదృశ్యమైంది. కంగారుపడిన కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దర్యాప్తు చేస్తుండగానే తనూజ మృతదేహం విజయవాడ మాచర్ల రోడ్డులో కనిపించడం కలకలం రేపింది.

తనూజ రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటుందని పోలీసులు తొలుత భావించారు. అయితే, ఆమె శరీరంపై రక్తపు మరకలు కానీ, గాయాలు కానీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న గుంటూరు, విజయవాడ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News