Kadapa District: జూనియర్ ఆర్టిస్టు ప్రాణం తీసిన పొరపాటు.. ఆసుపత్రి వద్ద జూనియర్ ఆర్టిస్టుల ఆందోళన

  • జూనియర్ ఆర్టిస్టుగానూ పని చేస్తున్న బ్యాంకు ఉద్యోగి జ్యోతి 
  • పండగ కోసం కడప వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
  • షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో పొరపాటున దిగిన జ్యోతి
  • రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కిందపడి మృతి
Junior Artist Jyothi Reddy died while getting running train in shadnagar

ఓ చిన్న పొరపాటు జూనియర్ ఆర్టిస్టు ప్రాణం తీసిన ఘటన షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగానూ పనిచేస్తోంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ పయనమైంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది.

రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్ అని తెలుసుకుని కంగారుపడింది. అప్పటికే రైలు కదలడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే రైల్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

More Telugu News