vaccination: కరోనా టీకాలు వేయడంలో మొదటి స్థానంలో చైనా!

  • 155 కోట్ల డోసులతో రెండో స్థానంలో భారత్ 
  • ఏడాది క్రితం టీకాల కార్యక్రమం ఆరంభం
  • చైనాలో 289 కోట్ల డోసులు
  • అమెరికాలో 52 కోట్ల డోసులు
covid vaccination programme worldwide

కరోనా మహమ్మారిపై టీకాలు ఇవ్వడం ఆరంభించి దేశంలో సరిగ్గా నేటికి ఏడాది పూర్తవుతోంది. 2021 జనవరి 16న మన దేశంలో టీకాల కార్యక్రమాన్ని తొలుత వృద్ధులు, హెల్త్ కేర్ సిబ్బందికి ఇవ్వడం ప్రారంభించారు. ఏడాదిలోనే భారత్ టీకా డోసుల పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికి 155 కోట్లకు పైగా టీకా డోసులను ప్రజలకు ఇచ్చింది. ఏడాదిలో ఇంత మందికి టీకాలు ఇవ్వడం అన్నది సాధారణ విషయం అయితే కాదు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ప్రజలకు కరోనా బారినుంచి రక్షణ కల్పించాలన్న సంకల్పంతో ఉద్యమంలా పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పుకోవాలి. 2020 ఫిబ్రవరిలో భారత్ లో తొలి కరోనా కేసు నమోదైంది. అంతకు రెండు నెలల ముందే చైనాలో ఈ వైరస్ మొగ్గతొడిగింది.

ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలను తీసుకొచ్చింది కరోనా విపత్తు సమయంలోనే అని చెప్పుకోవాలి. సాధారణంగా ఒక టీకా అభివృద్ధికి ఎంతలేదన్నా 3-5 ఏళ్ల సమయం పడుతుంది. లక్షలాది మంది ప్రాణాలను కరోనా బలి కోరుతూ ఉండడంతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చురుగ్గా పనిచేసి, అత్యవసర అనుమతుల కింద మినహాయింపులతో టీకాలను అమల్లోకి తీసుకొచ్చారు.

ఇక ఇప్పటి వరకు చైనాలో అత్యధికంగా 289 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు ఇచ్చి, వ్యాక్సినేషన్లో తోలి స్థానంలో నిలిచారు. భారత్ లో 155.3 కోట్ల డోసులు, అమెరికాలో 52.4 కోట్లు, బ్రెజిల్లో 33.9 కోట్లు, ఇండోనేషియాలో 29.3 కోట్లు, జపాన్ లో 20.2 కోట్లు, పాకిస్థాన్ లో 16.6 కోట్లు, వియత్నాంలో 16 కోట్లు, జర్మనీలో 15.7 కోట్లు, రష్యాలో 15 కోట్లు, మెక్సికోలో 15 కోట్ల డోసుల చొప్పున ప్రజలకు టీకాలు ఇచ్చారు.

ప్రపంచం మొత్తం మీద ఇచ్చిన డోసులు 945 కోట్లు. భారత్ లో రెండు డోసులూ పూర్తయిన జనాభా 46.9 శాతమే కాగా, అమెరికాలో 62.8 శాతం మందికి రెండు డోసులూ ఇచ్చారు.

More Telugu News