యూపీలో చరిత్ర సృష్టించనున్న బీజేపీ.. పంజాబ్ కేజ్రీవాల్ దే: ఏబీపీ సీ ఓటర్ సర్వే

BJP will win in Uttar Pradesh says ABP C Voter Survey
దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ఈ ఎలెక్షన్స్ ను సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తదుపరి లోక్ సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ భారత రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటుంది. లోక్ సభకు ఎక్కువ మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచే వెళ్తుంటారు. దీంతో, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటుంది. ప్రస్తుతం యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తా చాటి, చరిత్ర సృష్టిస్తుందని 'ఏబీపీ సీ ఓటర్' సర్వే తేల్చిచెప్పింది. యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎం కాబోతున్నారని తెలిపింది.

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 235 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో తేలింది. అఖిలేశ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ 157, మాయావతికి చెందిన బీఎస్పీకి 16 స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది. అయితే జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం యూపీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోబోతోంది. ఇండియాలో ఓల్డ్ గ్రాండ్ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్... 10 లోపు స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలో తేలింది. బీజేపీకి 41.5 శాతం ఓట్లు రావచ్చని తెలిపింది.  

మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నువ్వా? నేనా? అనే రీతిలో ఉంటుందని సర్వేలో తేలింది. హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పింది. గోవాలో మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది.

ఇక పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటబోతోందని సర్వేలో వెల్లడైంది. ఆప్ కు 58, కాంగ్రెస్ కు 43 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. శిరోమణి అకాలీదళ్ కు 23 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురుకాబోతోంది. బీజేపీ 3 స్థానాలకు మాత్రమే పరిమితం కానుందని తేలింది.

సర్వేలో తేలిన విధంగా పంజాబ్ లో ఆప్ గెలిస్తే... ఆ పార్టీ ఢిల్లీ వెలుపల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టవుతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుంటున్న ఆప్ కు... ఈ గెలుపు ఇతర రాష్ట్రాల్లో సైతం బలోపేతం కావడానికి కావాల్సినంత స్థైర్యాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.
Go Back to Shorts
ABP C Voter
Survey
Uttar Pradesh
Punjab
Uttarakhand
Goa
Manipur
BJP
Congress
AAP

More Telugu News