Justice K.Chandru: ఆరెస్సెస్, బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికి ముప్పు: మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు

  • ఒకే దేశం పేరుతో విభజన రాజకీయాలు జరుగుతున్నాయి
  • చట్టాలు తమకు అనుకూలంగా లేకుంటే రాజ్యాంగాన్ని సవరించేస్తున్నారు
  • మోదీ తన ప్రాణాలకు ఎవరి వల్ల ఎందుకు ముప్పు ఉందో చెప్పాలి
  • న్యాయస్థానాలు ఇవ్వాల్సింది తీర్పులు మాత్రమే
Justice K Chandru slams bjp and rss for their policies

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), బీజేపీపై మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండూ తమ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లోని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ మహాసభల్లో పాల్గొన్న ఆయన నిన్న మాట్లాడుతూ.. దేశంలో ఫాసిజం పాలన ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకే దేశం పేరుతో విభజన రాజకీయాలు జరుగుతున్నాయని, ఇందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను హస్తగతం చేసుకుంటున్న ఆరెస్సెస్ వాటిని బలహీన పరుస్తోందని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. చట్టాలు కనుక అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా లేకపోతే రాజ్యాంగాన్ని సవరించేస్తున్నారని విమర్శించారు.

ఇటీవల పంజాబ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారని, అయితే, ఎవరివల్ల, ఎందుకు ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందో చెప్పాలని జస్టిస్ చంద్రు డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు తీర్పులు మాత్రమే ఇవ్వాలని, సూచనలు కాదని అన్నారు.

More Telugu News