GV Harshakumar: జగన్‌ను భరించడం ఇక మా వల్ల కాదు.. ఎంతకాలమని కొట్టించుకుంటాం: కాంగ్రెస్ నేత హర్షకుమార్

  • దళితులకు మేలు చేస్తాడనుకుంటే చంపేస్తున్నాడు
  • ఎంతకాలమని ఈ అన్యాయాన్ని భరించాలి?
  • రాష్ట్రంలో వైసీపీ దమనకాండ పెరిగిపోయింది
  • గిరీశ్ ఆత్మహత్య కేసులో సీఐ, ఎస్సైపై సస్పెన్షన్ వేటు
Congress leader gv harshakumar slams cm Jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ మేలు చేస్తాడని అనుకుంటే దళితులను చంపేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌‌ను ఇక భరించడం తమ వల్ల కాదని అన్నారు. ఎంతకాలమని కొట్టించుకుంటామని, ఎంతకాలమని ఈ అన్యాయాన్ని భరించాలని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులకు మేలు చేస్తాడని భావించామని, కానీ తొలి నుంచీ దళితుల గొంతులను అణచివేస్తున్నారని, వారినే టార్గెట్ చేసి చంపేస్తున్నాడని ఆరోపించారు.

రాష్ట్రంలో వైసీపీ దమనకాండ దారుణంగా పెరిగిపోయిందని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ మొదలు సామర్లకోటలో ఆవుల గిరీశ్‌బాబు వరకు దళితులను హింసించి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గిరీశ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిర్ధారణ కావడంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సీఐ కేఎన్వీ జయకుమార్, సామర్లకోట ఎస్సై బి.అభిమన్యుడును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

More Telugu News