Telangana: తెలంగాణలో ఒక్కరోజులో 2 వేలకు పైగా కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 64,474 కరోనా పరీక్షలు
  • 2,295 కొత్త కేసుల వెల్లడి
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,452 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 9,861 మందికి చికిత్స
Telangana sees huge number of corona cases in a single day

తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 2,295 మందికి పాజిటివ్ గా తేలింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 232, రంగారెడ్డి జిల్లాలో 218 కేసులు గుర్తించారు. అటు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 278 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,039కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,89,751 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,75,851 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఈ నేపథ్యంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 9,861కి పెరిగింది.

More Telugu News