Subbarao Gupta: ఒంగోలులో 300 మంది రౌడీ షీటర్లు ఉంటే... వారిలో 250 మంది నాకు టచ్ లో ఉన్నారు: సుబ్బారావు గుప్తా

  • బాలినేని అనుచరుడు సుభానీ నన్ను కొట్టి విలన్ అయ్యాడు
  • నాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
  • ఆర్యవైశ్యులకు 25 సీట్లు ఇచ్చిన వారికే వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తాం

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభానీ తనను కొట్టి అందరి దృష్టిలో విలన్ అయ్యాడని... సుభానీ చేతిలో దెబ్బలు తిని తాను హీరో అయ్యానని వైసీపీ నేత సుబ్బారావు గుప్తా అన్నారు. టీడీపీ నేత వంగవీటి రాధా కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహిస్తే ఆయనకు గన్ మెన్లను పంపించారని... తనకు మాత్రం రక్షణ కల్పించలేదని చెప్పారు. తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందని అన్నారు.

ఒంగోలులో 300 మంది రౌడీ షీటర్లు ఉంటే వారిలో 250 మంది తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. రౌడీయిజం చేయాలనుకుంటే తాను కూడా చేయగలనని తెలిపారు. తనపై దాడి పోలీసుల సాయంతోనే జరిగిందని సుబ్బారావు గుప్తా అన్నారు. తనకు మెంటల్ ఉందని చెప్పిన వారికే మెంటల్ ఉందని ఎద్దేవా చేశారు.

తనపై దాడికి పాల్పడిన వారిపై సీఐడీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలోనే జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, అమిత్ షాలను కలుస్తానని... అప్పటికీ తనకు న్యాయం జరగకపోతే వేరే రాష్ట్రానికి వెళ్లిపోతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు 25 సీట్లు ఇచ్చిన వారికి తాము మద్దతిస్తామని చెప్పారు.

More Telugu News