ICC: స్లో ఓవర్ రేట్ కు ఫీల్డ్ లోనూ భారీ జరిమానా: టీ20 మ్యాచ్ లకు ఐసీసీ కొత్త రూల్స్

  • ఓవర్లు స్లోగా వేస్తే సర్కిల్ అవతల ఉన్న ఫీల్డర్లలో కోత
  • ఒకరిని సర్కిల్ లోపలికి తీసుకొచ్చేలా రూల్
  • ప్రతి ఇన్నింగ్స్ కూ మధ్యలో రెండున్నర నిమిషాల డ్రింక్స్ బ్రేక్
  • సిరీస్ ప్రారంభానికి ముందు జట్ల నిర్ణయానుసారం అమలు
ICC To Fine Hefty In T20 Internationals

అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లను మరింత వేగంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన నిబంధనలను తీసుకొచ్చింది. స్లో ఓవర్ రేట్ పై భారీ జరిమానాలను విధించనుంది. మ్యాచ్ అయిపోయాక విధించే ఫైన్లతో పాటు.. మ్యాచ్ జరుగుతున్నప్పుడూ భారీ మూల్యం చెల్లించుకునేలా కొత్త రూల్ ను పెట్టింది.

టైం ప్రకారం ఓవర్లను పూర్తి చేయకపోతే.. తదుపరి అన్ని ఓవర్లకూ 30 యార్డ్ సర్కిల్ అవతల ఓ ఫీల్డర్ ను కుదించే రూల్ ను పెట్టింది. ఓవర్లు లేట్ గా వస్తే ఇకపై ఒక ఫీల్డర్ ను సర్కిల్ లోపల పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.22లో మార్పులను చేసింది.

అంతేగాకుండా ఐపీఎల్ మాదిరిగానే అంతర్జాతీయ టీ20ల్లోనూ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ బ్రేక్ కూ అవకాశం ఇచ్చింది. ప్రతి ఇన్నింగ్స్ లోనూ రెండున్నర నిమిషాల పాటు ఈ ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్ ను సద్వినియోగం చేసుకునే వీలును కల్పించింది. ఇది సిరీస్ మొదలవడానికి ముందు రెండు జట్ల మధ్య కుదిరే ఏకాభిప్రాయాన్ని బట్టి ఉంటుందని వెల్లడించింది.

‘‘ఓవర్ రేట్ నిబంధనలను రూల్ బుక్ లోని 13.8 క్లాజ్ లో పొందుపరిచారు. ఓ ఇన్నింగ్స్ లోని చివరి ఓవర్ తొలి బంతిని నిర్దేశించిన సమయంలోపు వేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన అది సాధ్యపడకపోతే మిగతా ఓవర్లన్నింటికీ సర్కిల్ అవతల ఉన్న  ఒక ఫీల్డర్ ను తీసుకొచ్చి సర్కిల్ లోపల పెట్టాల్సి ఉంటుంది’’ అని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

More Telugu News