railway: రైల్వే కూడా వదలట్లేదుగా..! సువిధ రైళ్ల పేరుతో భారీ బాదుడు!

  • ఐదారు రెట్లు అధికంగా చార్జీలు
  • రద్దీని సొమ్ము చేసుకుంటున్న రైల్వే
  • పరిమిత సర్వీసులతో ప్రయాణికులకు అవస్థలు
  • ప్రైవేటు ట్రావెల్స్ ను తలపిస్తున్న ధరలు
railway collects higher fare on suvidha trains

డిమాండ్ ఉన్న సమయాల్లో, ముఖ్యమైన పండుగ రోజుల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రెండు మూడు రెట్ల మేర ధరలు పెంచి దోచుకోవడం మామూలే. కానీ, బాధ్యత కలిగిన కేంద్ర రైల్వే శాఖ ప్రయాణికులను భారీ చార్జీల రూపంలో నడ్డి విరుస్తోంది. ఇందుకు నిదర్శనమే సువిధ రైళ్ల పేరుతో నడుపుతున్న ప్రత్యేక రైళ్లు.

ఈ రైళ్లలో టికెట్ బుక్ చేసుకోవాలంటే.. ముందు బ్యాంకు బ్యాలన్స్ ను ఓసారి చెక్ చేసుకోవాల్సిందే. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు లక్షలాది మంది ప్రయాణమవుతారు. ఈ సమయంలో రద్దీ చెప్పలేనంత ఉంటుంది. దీంతో సహజంగానే రెగ్యులర్ రైళ్లలో టికెట్లు లభించడం కష్టం. ఈ సమయంలో సువిధ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే వాటి చార్జీలను రెగ్యులర్ రైళ్ల టికెట్లతో పోలిస్తే ఐదారు రెట్లు అధికంగా నిర్ణయించింది. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

కరోనా విపత్తు కాలంలో వైరస్ అంటుకునే రిస్క్ ఉన్నప్పుడు రద్దీ తగ్గించేందుకు రైల్వే ఎక్కువ సర్వీసులను నడపాలి. కానీ దీనికి విరుద్దంగా పరిమిత రైళ్లు, ప్రత్యేక రైళ్ల పేరుతో దోచుకోవడంపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది.

సికింద్రాబాద్, కాకినాడ స్లీపర్ చార్జీ సాధారణంగా రూ.355. కానీ సువిధ రైలులో రూ.1,235. థర్డ్ ఏసీ సాధారణ టికెట్ రూ.935 అయితే, సువిధలో రూ.2,360. ఇక సికింద్రాబాద్, విజయవాడ మధ్య స్లీపర్ టికెట్ చార్జీ సాధారణంగా రూ.225. కానీ, సువిధలో రూ.1,135 చెల్లించుకోవాలి. ఇదే మార్గంలో థర్డ్ ఏసీకి రెగ్యులర్ రైలులో చార్జీ రూ.660. సువిధలో రూ.2,160. కాచిగూడ, నర్సాపూర్ మధ్య సాధారణ రైలులో స్లీపర్ టికెట్ రూ.320. సువిధ రైలులో రూ.1,080. రెగ్యులర్ రైళ్లలో వేచి ఉండే జాబితా చాంతాడంత ఉంది.

  • Loading...

More Telugu News