Thota Trimurthulu: చంద్రబాబు పరామర్శతో వంగ‌వీటి రంగా ఆత్మ మరింత క్షోభిస్తుంది: తోట త్రిమూర్తులు

  • తండ్రిని చంపిన వ్య‌క్తే త‌న‌యుడిని ప‌రామ‌ర్శిస్తున్నారు
  • రంగా హత్య కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబే
  • ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
  • చంద్ర‌బాబు తీరును రాధా గుర్తించాలన్న త్రిమూర్తులు 
trimurtulu slams chandra babau

టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వంగవీటి రంగా తనయుడు వంగ‌వీటి రాధాను చంద్రబాబు ఇటీవ‌ల‌ పరామర్శించి, వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై తూర్పు గోదావరి జిల్లా మండపేటలో త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ.. రంగా హత్య కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబే అన్న‌ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

తండ్రిని చంపిన వ్యక్తే ఇప్పుడు తనయుడిని పరామర్శించడం సిగ్గుచేటని ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇటువంటి ప‌నుల‌తో రంగా ఆత్మ మరింత క్షోభిస్తుందని ఆయ‌న చెప్పారు. రంగా దారుణ హత్యకు గురై 35 ఏళ్లు పూర్త‌వుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న ఇప్ప‌టికీ అందరి హృదయాల్లో ఉన్నారని త్రిమూర్తులు అన్నారు.

ఇప్పుడు వంగ‌వీటి రాధా ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు అనుకుంటున్నార‌ని ఆయ‌న విమర్శించారు. రెక్కీ జరిగిన విషయాన్ని రాధా స‌ర్కారు దృష్టికి తీసుకువెళ్తే ఆయ‌న‌కు అవసరమైన రక్షణ ప్ర‌భుత్వ‌మే కల్పిస్తుందని తెలిపారు. చంద్ర‌బాబు తీరును రాధా గుర్తించాల‌ని ఆయ‌న సూచించారు.

More Telugu News