Whatsapp: భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించిన వాట్సాప్

  • 17 లక్షల ఖాతాలపై నిషేధం
  • ఇతర యూజర్ల ఫిర్యాదు ఆధారంగా చర్యలు
  • కొత్త ఐటీ విధానానికి అనుగుణంగా నిర్ణయం
  • ఫేక్ న్యూస్, అశ్లీల సమాచారం వ్యాప్తి చేస్తున్న ఖాతాల గుర్తింపు
Whatsapp bans lakhs of Indian users accounts

భారత కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన ఐటీ నిబంధనలు తీసుకురావడం తెలిసిందే. 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సంస్థ నెలవారీగా సేఫ్టీ రిపోర్టును వెల్లడించాలి. యూజర్ల భద్రత కోసం సదరు సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అందులో వివరించాలి. ఈ నేపథ్యంలో, వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన లక్షలాది ఖాతాలపై ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొరడా ఝుళిపించింది. 17 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది.

ఇతర యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ వెల్లడించింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుండడం, అశ్లీల సమాచారం వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. సదరు ఖాతాలు తమ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు తేలిందని తెలిపింది. ఈ మేరకు గత నవంబరు నెలలో భద్రతా నివేదిక రూపొందించినట్టు వాట్సాప్ పేర్కొంది.

వాట్సాప్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యూజర్లపై నిషేధం విధించడం ఇదేమీ కొత్తకాదు. గతేడాది అక్టోబరులో 20 లక్షల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసింది. తాము నిషేధించిన ఖాతాల్లో బల్క్, స్పామ్ సందేశాలు పంపేవి ఎక్కువగా ఉన్నాయని వాట్సాప్ వెల్లడించింది.

More Telugu News