medical gadgets: కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఈ గ్యాడ్జెట్లు దగ్గర ఉంచుకుంటే ప్రయోజనమే!

  • ఎవరికి వారే స్వయంగా పరీక్షించుకోవచ్చు
  • అనారోగ్య సమయాల్లో ఆదుకుంటాయి
  • అందుబాటులోనే   వీటి ధరలు
10 medical gadgets to keep at home

ఇప్పటికే కరోనా రెండు విడతల ప్రభావాన్ని చూశాం. ఒమిక్రాన్ రూపంలో మూడో విడత పొంచి ఉంది. మరో రెండు నుంచి మూడు నెలల్లో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలున్నాయి.

అయితే, కరోనా పూర్వపు రకాలతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనన్నది ఇప్పటి వరకు అందుబాటులోని సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఆక్సిజన్ స్థాయులు పడిపోయిన కేసులు తక్కువే ఉంటున్నాయి. అయినప్పటికీ కొన్ని వైద్య పరికరాలను మన దగ్గర ఉంచుకుంటే ఆందోళన లేకుండా ఎవరికి వారే తమ ఆరోగ్యాన్ని పరిశీలించుకునే వీలుంటుంది. ఈ పరికరాలు ఇప్పుడనే కాదు.. మారిన నేటి జీవనశైలిలో ఇతర అనారోగ్య సమయాల్లోనూ ఉపయోగపడతాయి.

పల్స్ ఆక్సీమీటర్
ఇదంటూ ఒకటి ఉందని కరోనాతోనే చాలా మందికి తెలిసింది. అప్పటి వరకు ఆసుపత్రుల్లోనే దీన్ని వినియోగించేవారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఏ మేరకు ఉందో తెలియజేస్తుంది. ఆరోగ్యవంతులైన వారికి 99-98 స్థాయిలో ఆక్సిజన్ ఉంటుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారికి సాధారణ రోజుల్లోనూ దీని అవసరం ఉంటుంది. రూ.500 నుంచి రూ.2,500 మధ్య వీటి ధరలున్నాయి. మన దేశీ బ్రాండ్లే కావాలనుకుంటే డాక్టర్ ట్రస్ట్, డాక్టర్ మోర్ పెన్, బీపీఎల్ కంపెనీలవి లభిస్తాయి.

డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్
ఒత్తిళ్లతో కూడిన నిత్యజీవితంలో డిజిటల్ బీపీ మానిటర్ ఎంతో అవసరం పడుతుంది. 30 ఏళ్ల నుంచే నేడు బీపీ సమస్యగా మారుతోంది. ఆల్కహాల్ ఎక్కువగా సేవించేవారు, గుండె జబ్బులు, మధుమేహులు, మూత్రపిండాల సమస్యలున్నవారు, అధిక బరువున్నవారు వారానికోసారి బీపీ చెక్ చేసుకోవడం మంచిది. రూ.1,500-3,000 మధ్య ఇది లభిస్తుంది.

కాంటాక్ట్ లెస్ థర్మామీటర్
దీన్నే ఇన్ ఫ్రా రెడ్ థర్మా మీటర్ అని కూడా అంటారు. బటన్ ను ప్రెస్ చేసి శరీరానికి 1-2 అంగుళాల దూరంలో ఉంచితే చాలు ఉష్ణోగ్రత ఎంత ఉన్నది చెబుతుంది. కరోనా వచ్చినప్పుడే అని కాదు.. సాధారణ రోజుల్లో జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది సాయపడుతుంది.

ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్
కోవిడ్-19 ర్యాపిడ్ యాంటీజెన్ సెల్ఫ్ కిట్ పేరుతో పలు ఫార్మా కంపెనీలు పరీక్షా కిట్లను విక్రయిస్తున్నాయి. ఎవరికి వారే స్వయంగా కరోనా వచ్చిందీ, లేనిదీ ఈ కిట్ తో పరీక్షించుకోవచ్చు. ఫార్మసీ స్టోర్లలో రూ.250 నుంచే ఇవి అందుబాటులో ఉన్నాయి.

గ్లూకోమీటర్
మధుమేహం సమస్య ఉన్న వారికి దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒకసారి అయినా రక్తంలో గ్లూకోజు స్థాయిని వారు పరిశీలించుకోవాలి. అలాగే, ఆరోగ్యవంతులు కూడా ఆరు నెలలు, ఏడాదికోసారి గ్లూకో మీటర్ తో పరీక్షించుకోవడం మంచిది. ఏ తరహా ఆహారం తీసుకుంటే గ్లూకోజు పరిమాణం ఎక్కువగా పెరుగుతోంది? అన్నది స్వయంగా నిర్ధారించుకోవచ్చు.

నెబులైజర్
చిన్నారులకు శ్వాసపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు నెబులైజర్ సాయంతో చికిత్స చేయడం ద్వారా వేగంగా ఉపశమనం లభిస్తుంది. పైగా నోటి ద్వారా ఇచ్చే ఔషధ పరిమాణంతో పోలిస్తే చాలా తక్కువ డోసేజీ సరిపోతుంది. నోటి ద్వారా మందులు ఇచ్చే అవకాశం లేని వారికీ దీని అవసరం ఉంటుంది. శ్వాసపరమైన సమస్యలతో బాధపడే వృద్ధులకు కూడా వైద్యులు నెబులైజర్ చికిత్స సిఫారసు చేస్తుంటారు. దీని ధర సుమారు రూ.1,000.

యూవీ స్టెరిలైజర్
చేతులను శానిటైజ్ చేసుకుంటాం. మళ్లీ ఫోన్ ను పట్టుకుని వినియోగిస్తుంటాం. ఫోన్ కు సైతం శానిటైజ్ చేసినప్పుడే కదా పూర్తి రక్షణ. మొబైల్ ఫోన్ కు లిక్విడ్ శానిటైజ్ చేయలేము. డ్రై శానిటైజర్ల ధర ఎక్కువ. దీనికి బదులు యూవీ శానిటైజర్ నయం. ఇంటిల్లిపాదీ తమ ఫోన్లను శానిటైజ్ చేసుకోవచ్చు. యూవీ రేడియేషన్ ఫోన్లపై ఉండే వైరస్, బ్యాక్టీరియాలను అంతం చేస్తుంది. దీని ధర రూ.1,000 నుంచి మొదలవుతుంది.

ఫిట్ నెస్ బ్యాండ్
చేతికి వాచీ మాదిరిగా ధరించే ఫిట్ నెస్ బ్యాండ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకునేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్ని అడుగులు నడిచాము? గుండె రేటు ఎంతుంది? ఆక్సిజన్ స్థాయి ఎంత? అన్నవి తెలుస్తాయి. మంచి కంపెనీల ఫిట్ నెస్ బ్యాండ్లు రూ.1,500కు పైన ఉన్నాయి.

More Telugu News