gold prices: బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 2022లో రూ.55,000కు!

  • ద్రవ్యోల్బణం, ఒమిక్రాన్ అనిశ్చితి సాయపడతాయి
  • 2022 ద్వితీయ భాగంలో ధర పెరుగుతుందన్న అంచనా
  • రూపాయి క్షీణతతో దేశీయంగా ధర అధికం
Gold to add glitter in 2022

2020లో కరోనా రాకతో బంగారం ధరలు మంచి ర్యాలీ చేశాయి. తులం (10 గ్రాములు) ధర రూ.57,000 వరకు వెళ్లి కొనుగోలుదారులను అయోమయానికి గురి చేసింది. కానీ, ఈక్విటీ మార్కెట్లు పుంజుకుని మెగా ర్యాలీ దిశగా ప్రయాణం చేయడంతో ఇన్వెస్టర్లు.. అధిక ధరల వద్దనున్న బంగారం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుని ఈక్విటీలకు మళ్లించారు. ఫలితంగా 2021లో బంగారం రూ.42,000-49,000 మధ్య ఎక్కువ కాలం పాటు కొనసాగింది.

కానీ, 2022లో బంగారం ధరలు మళ్లీ తళుక్కుమంటాయని మార్కెట్ పండితులు అంటున్నారు. 10 గ్రాముల ధర రూ.55,000ను చేరుకోవచ్చన్న అంచనాతో ఉన్నారు. 2020లో బంగారం 10 గ్రాముల ధర కమోడిటీ ఎక్చేంజ్ ఎంసీఎక్స్ లో రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుత ధర 10 శాతానికంటే తక్కువ లోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోని ధరతో పోలిస్తే మన దగ్గర 3 శాతం ఎక్కువగా ఉందని, రూపాయి విలువ క్షీణించడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు తోడు ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మధ్య కాలానికి బంగారం ధరలు పెరుగుతాయన్నది వారి అంచనా.

‘‘2022 మొదటి భాగంలో ఔన్స్ బంగారం ధర 1,700-1,900 డాలర్ల మధ్య చలించొచ్చు. 2022 రెండో భాగంలో 2,000 డాలర్లను దాటిపోతుంది. 10 గ్రాముల బంగారం ధర రూ.55,000 చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం’’ అని కామ్ ట్రెండ్జ్ సీఈవో త్యాగరాజన్ పేర్కొన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం, బాండ్ ఈల్డ్స్ పెరగడం బంగారం ధరలకు మద్దతునిస్తాయని మరో అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.

More Telugu News