Uttar Pradesh: దొంగతనం నేరం మోపి దళిత బాలికను చిత్రహింసలు పెట్టిన కుటుంబం.. వీడియో వైరల్

  • ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఘటన
  • దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు
  • సీఎం యోగిపై ప్రియాంక గాంధీ ఫైర్
  • నిందితులను కఠినంగా శిక్షించాలన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
Attack on girl in Amethi Video goes viral

దొంగతనం చేసిందని ఆరోపిస్తూ అభంశుభం తెలియని ఓ దళిత బాలికను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనలో బాలికను నేలపై పడుకోబెట్టి ఆమె కాళ్లను ఎత్తి పట్టుకుని పాదాలపై కర్రలతో చావబాదారు. చుట్టూ ఉన్న వారు చోద్యం చూస్తూ వారిని మరింత ప్రోత్సహించడం షాక్‌కు గురిచేస్తోంది. దెబ్బలకు తాళలేక బాలిక విలవిల్లాడుతున్నా జాలి చూపలేదు సరికదా.. మరింతగా చెలరేగిపోయారు.

ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగానూ పెను దుమారమే రేపుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోలీసులను కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతి రోజు 34 కులపరమైన నేరాలు, మహిళలపై 135 నేరాలు నమోదవుతున్నాయని అన్నారు. అయినప్పటికీ పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

More Telugu News