Team India: సెంచురియన్ టెస్టులో గెలుపు బాటలో టీమిండియా

  • దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 305 పరుగులు
  • ముగిసిన నాలుగో రోజు ఆట
  • 4 వికెట్లకు 94 పరుగులు చేసిన సఫారీలు
  • కెప్టెన్ డీన్ ఎల్గార్ ఒంటరిపోరాటం
  • బుమ్రాకు రెండు వికెట్లు
Team India on winning track in Centurion test

సెంచురియన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. మరో 6 వికెట్లు తీస్తే తొలి టెస్టులో టీమిండియా జయకేతనం ఎగురవేస్తుంది. 305 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 94 పరుగులు చేశారు. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 211 పరుగులు చేయాలి.

ఆటకు రేపు చివరి రోజు కాగా.... ఊపుమీదున్న టీమిండియా పేసర్లను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా లోయరార్డర్ కు సవాలే. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గార్ 52 పరుగులతో ఆడుతున్నాడు. ఆట మరికొంచెం సేపట్లో ముగుస్తుందనగా, బుమ్రా ఓ అద్భుతమైన బంతితో నైట్ వాచ్ మన్ కేశవ్ మహరాజ్ ను బౌల్డ్ చేశాడు.

అంతకుముందు, ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ కేవలం ఒక పరుగు చేసి షమీ బౌలింగ్ లో అవుటయ్యాడు. 17 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ ను సిరాజ్ అవుట్ చేయగా, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు, షమీ, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులు చేయగా, ఆతిథ్య దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులు చేసింది.

More Telugu News