Mummy: ఇప్పటిదాకా ఓపెన్ చేయని మమ్మీ ఇదే.. 3,500 ఏళ్లవుతున్నా కొద్దిగానైనా చెక్కు చెదరలేదు!

  • తెరిచేందుకు వీలు లేకుండా ప్యాక్ చేశారంటున్న సైంటిస్టులు
  • తొలిసారి 1881లో లగ్జర్ లోని సైట్ లో అమెనోటెప్ 1 మమ్మీ గుర్తింపు
  • తాజాగా డిజిటల్ గా ఓపెన్ చేసిన సైంటిస్టులు
  • మమ్మీ 2డీ, త్రీడీ ఫొటోలు తీసి విశ్లేషణ
  • లోపలి అవయవాలన్నీ తీసేసినా మెదడు, గుండెను తొలగించని వైనం
Un Opened Mummy Now Digitally Opened

మమ్మీలనగానే ఎక్కడికక్కడ పాడైపోయిన స్థితిలో ఉన్నవాటినే ఇప్పటిదాకా మనం చూసి ఉంటాం. కానీ, 3,500 ఏళ్లవుతున్నా ఆ మమ్మీ మాత్రం చెక్కు చెదరలేదు. ముఖం ఎముక రూపు మారలేదు. దంతాలు పాచిపట్టలేదు.. దవడలు విరిగిపోలేదు. ఇది క్రీస్తుపూర్వం 1525 నుంచి 1504 వరకు ఈజిప్ట్ ను పాలించిన రాజు ఫారో అమనోటెప్ 1 మమ్మీ. తాజాగా కైరో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సహర్ సలీమ్ నేతృత్వంలోని సైంటిస్టులు దీనిని విప్పి చూశారు.

ఇప్పటి కాలంలో ఓపెన్ చేయకుండా పెట్టిన మమ్మీ ఈ రాజుదే కావడం విశేషం. ఈ క్రమంలోనే 35 ఏళ్లుండే ఆ యువ రాజు మమ్మీని ఓపెన్ చేసి.. సీటీ స్కాన్లు చేశారు. ఆ రాజు చనిపోయినప్పుడు ఎంత దేహదారుఢ్యంతో ఉన్నాడో.. ఇప్పుడు కూడా అంతే గట్టిగా అది ఉన్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. 169 సెంటీమీటర్ల పొడవున్న రాజుది సహజ మరణమేనంటున్నారు.  


సీటీ స్కాన్లు చేసిన మమ్మీని 2డీ, త్రీడీ చిత్రాలు తీసి.. డిజిటల్ పద్ధతిలో అమెనోటెప్ 1 మమ్మీని తెరిచారు. సన్నని దవడతో అచ్చం తన తండ్రి లాగానే ఈ రాజు ఉండేవాడని అంచనా వేశారు. ఆయన దంతాలు కొంచెం కూడా పాడు కాలేదని, ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయని అన్నారు.

అతడు సహజంగానే మరణించినప్పటికీ.. దేనివల్ల చనిపోయాడని చెప్పేందుకు ఒంటి మీద చిన్న గాయం కూడా లేదని పేర్కొన్నారు. అయితే, రాజు మమ్మీని సమాధి చేసిన తర్వాత సమాధుల దొంగల తవ్వకాలతో ఆయన దేహంపై కొన్ని గాయాలున్నాయని చెప్పారు. ఆయన అంతర్గత అవయవాలను తీసేసినా.. మెదడు, గుండెను మాత్రం తీయలేదని వెల్లడించారు.


ఇప్పటిదాకా ఎందుకు ఓపెన్ చేయలేదంటే..

ఆమోస్ 1 మరణం తర్వాత అమెనోటెప్ 1 రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. దాదాపు 21 ఏళ్ల పాటు ఈజిప్ట్ ను పాలించాడు. తన సామ్రాజ్యాన్ని ఆయన కుష్, లిబియాకు విస్తరించాడని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. తొలిసారిగా 1881లో లగ్జర్ లోని డయీర్ ఎల్ బహారీ రాయల్ క్యాచెలో అమెనోటెప్ 1 మమ్మీని గుర్తించారు.

అయితే, అమెనోటెప్ 1 మమ్మీని ఇప్పటివరకు తెరవకపోవడంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ మమ్మీని తెరిచేందుకు అవకాశమే లేకుండా చాలా పక్కాగా ప్యాక్ చేసి పెట్టారని అంటున్నారు. మంచి మంచి పూల మాలలతో అలంకరించారని చెబుతున్నారు. జీవం ఉట్టిపడే మాస్క్ తో మొహాన్ని కప్పి ఉంచారని తెలిపారు. అందుకే ఇన్నాళ్లూ దానిని ఓపెన్ చేయలేదని, ఇప్పుడూ డిజిటల్/వర్చువల్ గానే మమ్మీ కట్లను విప్పి దానిని అధ్యయనం చేశామని అంటున్నారు.

More Telugu News