Sai Dharam Tej: మా నోటీసులకు సినీ నటుడు సాయిధరమ్ తేజ్ స్పందించలేదు: హైదరాబాద్ పోలీసులు

  • సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై త్వరలో చార్జ్‌షీట్
  • ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మృతి
  • హెల్మెట్ ధరించకపోవడం వల్లే వారిలో 80 మంది ప్రాణాలు గాల్లోకి
  • డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.5 కోట్ల జరిమానా వసూలు
Mega Hero Sai Dharam Tej not responded to police notices

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు పంపిన నోటీసులపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఆయనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్ల వివరాలు ఇవ్వాలని నోటీసులు పంపామని, కానీ ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని సీపీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెప్పారు.

అలాగే, సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది జరిగిన నేరాలు, రహదారి ప్రమాదాలకు సంబంధించి వార్షిక నివేదికను కూడా సీపీ స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య తగ్గిందన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మరణిస్తే.. వారిలో 80 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణించినట్టు చెప్పారు. 712 రోడ్డు ప్రమాదాల్లో మద్యం మత్తు కారణంగా జరిగినవి 212 ఉన్నట్టు వివరించారు.

డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారి నుంచి రూ.4.5 కోట్ల జరిమానా వసూలు చేశామని, 9,981 మంది లైసెన్సులు రద్దు చేశామని పేర్కొన్నారు. అలాగే, ఆస్తులకు సంబంధించి 4.3 శాతం నేరాలు పెరిగినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

More Telugu News