Centurion Test: సెంచురియన్ టెస్టులో రెండో రోజు ఆట వర్షార్పణం

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
  • తొలిరోజు 3 వికెట్లకు 272 రన్స్ చేసిన భారత్
  • రెండో రోజు సెంచురియన్ లో వరుణుడి జోరు
  • చెరువులా మారిన సూపర్ స్పోర్ట్ పార్క్
Second day play cancelled due to rain in Centurion test

సెంచురియన్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టులో రెండో రోజు ఆట రద్దయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో ఇవాళ్టి ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు. కనీసం లంచ్ తర్వాత సెషన్ అయినా సాధ్యపడుతుందని ఆశించినా, మైదానంలో భారీ నీరు నిలిచిపోవడంతో నిరాశ తప్పలేదు. మరోసారి భారీ వర్షం పడడంతో సూపర్ స్పోర్ట్ పార్క్ చెరువులా మారింది. దాంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు రెండో రోజు ఆట రద్దయినట్టు ప్రకటించారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో కోహ్లీ సేనదే పైచేయిగా నిలిచింది. 3 వికెట్లకు 272 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో మొదటి రోజు ఆట ముగించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించడం తొలి రోజు ఆటలో హైలైట్. రాహుల్ 248 బంతులాడి 122 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాహుల్ కు జోడీగా అజింక్యా రహానే 40 పరుగులతో ఆడుతున్నాడు.

అంతకుముందు, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 60 పరుగులు చేసి ఓ సందేహాస్పద ఎల్బీడబ్ల్యూ నిర్ణయానికి బలయ్యాడు. పుజారా డకౌట్ కాగా, కెప్టెన్ కోహ్లీ 35 పరుగులు సాధించాడు. సఫారీ బౌలర్లలో పేసర్ లుంగీ ఎంగిడి 3 వికెట్లు సాధించాడు.

More Telugu News