Upasana Konidela: ఉపాసనకు గోల్డెన్ వీసాను జారీ చేసిన యూఏఈ ప్రభుత్వం

  • ప్రముఖుల గౌరవార్థం గోల్డెన్ వీసా
  • దీర్ఘకాలం యూఏఈ పౌరుడిగా ఉండే చాన్స్
  • క్రిస్మస్ కానుక అంటూ మురిసిపోయిన ఉపాసన
  • తాను ఇప్పుడు ప్రపంచ పౌరురాలిని అంటూ హర్షం
UAE govt gives Golden Visa to Upasana Konidela

అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్, మెగా కోడలు ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రిస్మస్ కు ఓ కానుక అందుకున్నానని తెలిపారు.

ఇటీవల జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచమంతా ఒక్కటే అని తెలుసుకున్నానని, 'వసుధైక కుటుంబం' అనే భావనకు అర్థం తెలిసిందని వివరించారు. ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషం కలిగిస్తోందని ఉపాసన పేర్కొన్నారు. మనసా వాచా భారతీయురాలినని, అయితే అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు గోల్డెన్ వీసా రాకతో అధికారికంగా ప్రపంచ పౌరురాలిని అయ్యానని వివరించారు.

సాధారణంగా యూఏఈలో ఉద్యోగం, వ్యాపారం, చదువు కోసం వెళ్లే విదేశీయులకు అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. గోల్డెన్ వీసా ఉన్నట్టయితే నేషనల్ స్పాన్సర్ లేకుండానే యూఏఈలో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ వీసా ఉంటే 100 శాతం యూఏఈ పౌరుడిగానే భావిస్తారు.

గోల్డెన్ వీసాలు లాంగ్ టర్మ్ వీసాలు. ఐదేళ్లు, పదేళ్ల ప్రాతిపదికన జారీ చేసే ఈ వీసాలు ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతాయి. 2019 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది భారత ప్రముఖులు యూఏఈ గోల్డెన్ వీసాలు అందుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్రలకు ఈ వీసా దక్కింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబం కూడా ఈ గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉంది.

More Telugu News