kurella vittalacharya: ప్రధాని ప్రశంసలపై స్పందించిన తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ కూరెళ్ల

  • గ్రంథాలయ సేవలను మెచ్చుకున్న ప్రధాని మోదీ
  • కలల్ని నెరవేర్చుకునేందుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు
  • మరెందరికో స్ఫూర్తి నిచ్చారని కితాబు
  • బాధ్యత మరింత పెరిగిందన్న కూరెళ్ల
Dr kurella outstanding servises inspired to many

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఒక తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడి విశేష సేవలను ప్రస్తావించడం ఆసక్తిని రేకెత్తించింది. ఆయనే డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. తన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకిలో ఆయన అతిపెద్ద గ్రంధాలయాన్ని నిర్వహిస్తున్నారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎందరో ప్రతిభ చూపిన మహానుభావుల సేవలను ప్రధాని ప్రస్తావించారు.  ‘‘భారతదేశం ఎందరో ప్రతిభావంతులతో సుసంపన్నం అయింది. అటువంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య కూడా ఒకరు. కలల్ని నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని 84 ఏళ్ల వయసున్న విఠాలాచార్య నిరూపించారు. పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలన్న కోరికను వృద్ధాప్యంలో నెరవేర్చుకున్నారు. సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చారు’’ అంటూ ఆయన సేవలను మెచ్చుకున్నారు. ఆయన స్ఫూర్తితో మరో 8 గ్రంథాలయాలు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు.

ప్రధాని ప్రశంసలు తన బాధ్యతను మరింత పెంచినట్టు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చెప్పారు. తెలుగు ఉపాధ్యాయుడిగా డాక్టర్ కూరెళ్ల ఎంతో మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దడమే కాకుండా.. ఎన్నో పుస్తకాలను రచించారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

వెల్లంకిలోని తన ఇంటిలోనే 2014 ఫిబ్రవరిలో 5 వేల పుస్తకాలతో చిన్న గ్రంధాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 2 లక్షల పుస్తకాలకు అది విస్తరించింది. దాతల సహకారంతో కొత్తగా నిర్మించిన భవనంలో గ్రంధాలయాన్ని నిర్వహిస్తున్నారు.

More Telugu News