World: ఫస్ట్ టైం: ప్రపంచ ఎకానమీ వంద లక్షల కోట్ల డాలర్లు!

  • బ్రిటన్ కన్సల్టెన్సీ సేబర్ నివేదికలో వెల్లడి
  • వచ్చే ఏడాది ఫ్రాన్స్ ను దాటనున్న భారత్
  • 2023లో బ్రిటన్ ను దాటి ఆరోస్థానానికి
  • 2023 లేదా 2024లో ఆర్థిక మాంద్యం వచ్చే ముప్పుందని అంచనా
World Economy To Top 100 Trillion Dollars For The First Time In The History

చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచ ఎకానమీ రికార్డు సృష్టించబోతోంది. వచ్చే ఏడాది ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ విలువ 100 లక్షల కోట్ల డాలర్ల మార్కును దాటుతుందని నిపుణులు తేల్చారు. అంతేకాదు.. అమెరికాను దాటేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రారాజుగా నిలిచేందుకు చైనా మరో రెండేళ్లు నిరీక్షించక తప్పదు. బ్రిటన్ కు చెందిన సేబర్ అనే కన్సల్టెన్సీ ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నివేదికను విడుదల చేసింది.

ఆ నివేదిక ప్రకారం అమెరికాను చైనా 2030లో దాటుతుందని నిపుణులు తేల్చారు. అంతేగాకుండా వచ్చే ఏడాది భారత్.. ఫ్రాన్స్ ను దాటేస్తుందని, 2023లో బ్రిటన్ ను వెనక్కు నెట్టి మళ్లీ ఆరోస్థానానికి చేరుకుంటుందని రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఆయా దేశాలు ఎలా డీల్ చేస్తాయన్న దానిపైనే ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని సేబర్ డిప్యూటీ చైర్మన్ డగ్లస్ మెక్ విలియమ్స్ చెప్పారు.

ప్రస్తుతం అమెరికా ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందన్నారు. స్థిర మూల విషయాలను నియంత్రణలో ఉంచినంత వరకు ఫర్వాలేదని, లేకపోతే 2023 లేదా 2024లో ప్రపంచం ఆర్థిక మాంద్యం గుప్పిట్లో చిక్కుకునే ముప్పుందని హెచ్చరించారు. కాగా, 2033 నాటికి ఆర్థిక వ్యవస్థ విషయంలో జపాన్ ను జర్మనీ దాటేస్తుందని రిపోర్ట్ లో అంచనా వేశారు. 2036 నాటికి రష్యా టాప్ టెన్ లోకి వస్తుందని పేర్కొన్నారు. 2034 నాటికి ఇండోనేషియా 9వ స్థానానికి చేరుతుందంటున్నారు.

More Telugu News