Supreme Court: మతిస్థిమితం కోల్పోయి విశాఖ ఆర్కేబీచ్‌లో తిరుగుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది రమాదేవి.. ఆశ్రయ కేంద్రంలో కలిసిన బార్ కౌన్సిల్ అధ్యక్షుడు

  • వారం రోజులుగా ఆర్కే బీచ్‌లో తిరుగుతున్న రమాదేవి
  • తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్న వైనం
  • సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
Supreme court lawyer Ramadevi lost her sanity and wandered around RK Beach

సుప్రీంకోర్టు న్యాయవాది రమాదేవి మతిస్థిమితం కోల్పోయి విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో తిరుగుతున్న విషయం తెలిసి న్యాయవాదులు షాకయ్యారు. విశాఖపట్టణం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింగరావు, ఇతర న్యాయవాదులు నిన్న ఆమె ఉంటున్న ఆశ్రయ కేంద్రానికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. వారం రోజులుగా రామకృష్ణా బీచ్‌లో తిరుగుతున్నఆమె తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడుతుండడంతో అనుమానించిన పోలీసులు ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె సుప్రీంకోర్టు న్యాయవాది అని తెలిసింది. ఆమె తన గుర్తింపు కార్డును కూడా చూపించడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు మరిన్ని విషయాల కోసం ఆరా తీశారు.

తనకు భర్త, కుమారుడు ఉన్నారని చెప్పినప్పటికీ వారి గురించి పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఆమెను టీఎస్సార్ కాంప్లెక్స్‌లోని ఆశ్రయ కేంద్రానికి తరలించారు. అయితే, అక్కడ ఉండేందుకు నిరాకరించిన ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అతి కష్టం మీద ఆమె బయటకు వెళ్లకుండా నిలువరించారు. అయితే, శనివారం మాత్రం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయలేదని ఆశ్రయ కేంద్రం నిర్వాహకురాలు జ్యోతిర్మయి తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ రమాదేవి పరిస్థితిని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

More Telugu News