Budda Venkanna: సినిమా వాళ్ల నుంచి కమిషన్లు రావడం లేదనే జగన్ కక్ష కట్టారు: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • హీరోలను దెబ్బతీయడమే జగన్ లక్ష్యం
  • థియేటర్లపై దండయాత్ర చేసేందుకు అధికారులను పంపిస్తున్నారు
  • రాజకీయ స్వలాభం కోసం జగన్ పని చేస్తున్నారు
Jagan target is to destroy film industry says Budda Venkanna

సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. తాజాగా ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోలను దెబ్బ తీయడం, ఇండస్ట్రీని నాశనం చేయడమే జగన్ లక్ష్యమని అన్నారు. సినిమా వారి నుంచి కమిషన్లు రావడం లేదనే జగన్ వారిపై కక్ష కట్టారని చెప్పారు. థియేటర్లపై దండయాత్ర చేసేందుకు అధికారులను పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే పట్టించుకోని జగన్... సినిమా టికెట్ల అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శించారు.
 
వేల ఎకరాలను దానం చేసిన అశోక్ గజపతిరాజును దోపిడీదారులు అవమానిస్తున్నారని వెంకన్న మండిపడ్డారు. అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి కూడా మంత్రులకు లేదని అన్నారు. మంత్రులు రెచ్చిపోతున్నారని, వారి తాట తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. అశోక్ గజపతిరాజుపై కేసు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ స్వలాభం కోసమే జగన్ పని చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News