Telangana: తెలంగాణలో చలి చంపేస్తుండడానికి కారణం ఇదేనట!

  • తెలంగాణలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
  • తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు
  • నేడు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం
this is the reason behind cold in telangana

తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలిపులి చంపేస్తోంది. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా వణికిస్తోంది. రోజంతా అంటిపెట్టుకునే చలితో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో చలి ఇంతగా విజృంభించడానికి కారణం తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడమేనని వాతావరణశాఖ తెలిపింది. నేడు కూడా చలి తీవ్రంగా ఉంటుందని, సాధారణం కంటే నేడు 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఫలితంగా చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.

చలి తీవ్రత పెరగడం, శీతల గాలులు వీస్తున్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, నిన్న తెల్లవారుజామున కుమురంభీం జిల్లా గిన్నెధరిలో అత్యంత కనిష్ఠంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 6.8, మెదక్‌లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, సోమవారం నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే మంగళవారం తెల్లవారుజామున 1 నుంచి 2 డిగ్రీలు పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

More Telugu News