Omicron: తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

  • కొత్తగా 14 మందికి ఒమిక్రాన్
  • తెలంగాణలో 38కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
  • గత 24 గంటల్లో తెలంగాణలో 182 కరోనా కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,610 మందికి చికిత్స
Few more Omicron cases in Telangana

తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ గా వస్తోంది. ఒమిక్రాన్ అనుమానితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా 14 మందికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దాంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది.

అటు, తెలంగాణలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 37,353 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 91 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. హనుమకొండ జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 196 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,074 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,447 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,610 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,017కి పెరిగింది.

More Telugu News