Uppalapati Venkata Ramanamurthy Raju: స్వామీజీ వేషధారణలో గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాలనపై వివరాలు సేకరించిన వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

  • ఎలమంచిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటన
  • నవరత్నాలు పథకం సహా పలు పథకాలపై అభిప్రాయ సేకరణ
  • తహసీల్దార్ వద్ద ప్రజల సమస్యల ప్రస్తావన
  • మీరెవరని ప్రశ్నించడంతో వేషం తొలగింపు
 ELAMANCHILI MLA Kanna Babu Changed his style as swamiji and rounds in villages

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు) వేషం మార్చి గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షమాలతో నియోజకవర్గంలోని అచ్యుతాపురం, ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించారు. స్వామీజీ వేషధారణలో ఉన్న ఆయనను ఒక్కరంటే ఒక్కరు కూడా గుర్తు పట్టలేకపోవడం గమనార్హం.

ఎవరో స్వామీజీ వచ్చారని జనం భావించారు తప్పితే ఆ వేషంలో ఉన్నది సాక్షాత్తూ ఎమ్మెల్యే అని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలు భరించలేనంతగా ఉన్నాయని ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు బాగాలేవని కొందరు చెప్పారు. ప్రజలు చెప్పేవన్నీ ఆయన శ్రద్ధగా విన్నారు.  

ఆ తర్వాత నేరుగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ రాంబాయి, ఎంపీడీవో కృష్ణ వద్దకు వెళ్లారు. ప్రజలు తన వద్ద ప్రస్తావించిన విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ని విషయాలు చెబుతున్న మీరెవరని వారు ప్రశ్నించడంతో అప్పుడు వేషం తొలగించిన ఎమ్మెల్యే వారిని షాక్‌కు గురిచేశారు. కాగా, ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరుపైనా, పథకాలపైనా ప్రజలు వందశాతం సంతోషంగా ఉన్నట్టు ఈ సందర్భంగా తాను తెలుసుకున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News