mobile games: కంపెనీలకు కనకవర్షం కురిపిస్తున్న మొబైల్ గేమ్ లు ఇవే..! 

  • పబ్ జీకి (బ్యాటిల్ గ్రౌండ్స్) తగ్గని ఆదరణ
  • ఆదాయంలో అగ్రస్థానం
  • 2021లో రూ.21,000 కోట్ల ఆదాయం
  • ఆనర్ ఆఫ్ కింగ్స్ కూ ఇంతే ఆదాయం
mobile games that users spent most on in 2021

మొబైల్ గేమ్ లే కదా అనుకోవద్దు. ఇప్పుడు చెప్పుకోబోతున్న మొబైల్ గేమ్ లు వాటి రూపకర్తలకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ ఏడాది (2021లో) ఇప్పటి వరకు ఒక్కోటీ బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టిన మొబైల్ గేమ్ ల వివరాలతో పరిశోధనా సంస్థ ‘సెన్సార్ టవర్’ ఓ జాబితాను విడుదల చేసింది.

పబ్ జీ గురించి తెలియనివారు తక్కువే. ఈ గేమ్ పై హక్కులు చైనా సంస్థ టెన్సెంట్ కు ఉండడంతో భద్రతకు ముప్పు అంటూ భారత ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే. ఆ తర్వాత ఈ గేమ్ ను దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ బ్యాటిల్ గ్రౌండ్స్ పేరుతో భారత్ లో విడుదల చేసింది. చైనాలో గేమ్ ఫర్ పీస్ పేరుతో వినియోగంలో ఉంది. ఈ మొబైల్ గేమ్ 2.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఈ ఏడాది దాని యజమానులకు తెచ్చి పెట్టింది. మన కరెన్సీలో సుమారు రూ.21,000 కోట్లు అన్నమాట.

ఆనర్ ఆఫ్ కింగ్స్ గేమ్ కూడా ఇంచుమించు బ్యాటిల్ గ్రౌండ్స్ స్థాయిలోనే సుమారు 2.8 బిలియన్ డాలర్ల ఆదాయన్ని తెచ్చిపెట్టింది. చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ అనుబంధ కంపెనీ టిమిస్టూడియోస్ కు ఈ గేమ్ పై హక్కులు ఉన్నాయి.

మూడో స్థానంలో జెన్షిన్ ఇంపాక్ట్ మొబైల్ గేమ్ నిలిచింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ రూపంలో 2.4 బిలియన్ డాలర్ల ఆదాయం (రూ.18,000 కోట్లు) మిహోయో కంపెనీకి దక్కింది. 2020 సెప్టెంబర్ 28న ఈ గేమ్ విడుదలైంది.

రోబ్లాక్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన రోబ్లాక్స్ గేమ్ నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ గేమ్ రూపంలో ఈ ఏడాది 1.3 బిలియన్ డాలర్ల (రూ.9,750 కోట్లు) ఆదాయాన్ని రోబ్లాక్స్ కార్పొరేషన్ గడించింది.

కాయిన్ మాస్టర్ గేమ్ ను ఇజ్రాయెల్ కు చెందిన స్టూడియో మూన్ యాక్టివ్ సంస్థ రూపొందించింది. ఇది ఉచిత గేమ్. ఒక్కరే ఆడతగినది. 2021లో ఈ గేమ్ రూపంలో 1.3 బిలియన్ డాలర్ల (రూ.9,750కోట్లు) ఆదాయం మూన్ యాక్టివ్ కు లభించింది.

పొకేమాన్ గో మొబైల్ గేమ్ 1.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని (రూ.9,000 కోట్లు) ఈ ఏడాది సొంతం చేసుకుంది. నియాంటిక్ అనే సంస్థ ఈ గేమ్ ను తయారు చేసింది. అంతర్జాతీయంగా 100 కోట్లకు పైగా గేమ్ డౌన్ లోడ్ లు నమోదయ్యాయి.

క్యాండీ క్రష్ సాగా మొబైల్ గేమ్ పాతదే అయినా ఆదరణ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ గేమ్ రూపంలో కింగ్ అనే సంస్థకు ఈ ఏడాది 1.2 బిలియన్  డాలర్ల (రూ.9,000 కోట్లు) ఆదాయం లభించింది.

ఇక చివరిగా చెప్పుకోవాల్సిన మొబైల్ గేమ్ గరెనా ఫ్రీఫైర్. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ రూపంలో ఈ ఏడాది లభించిన ఆదాయం 1.1 బిలియన్ డాలర్లుకు పైనే (రూ.8,250 కోట్లు) ఉంది. ఒకరి కంటే ఎక్కువ మంది ఆడే షూటింగ్ గేమ్ ఇది.

More Telugu News