Hamsa Nandini: సినీ నటి హంసానందినికి బ్రెస్ట్ క్యాన్సర్!

  • 4 నెలల క్రితం రొమ్ములో కణితి ఉన్నట్టు అనిపించిందన్న హంస
  • వైద్య పరీక్షల్లో క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్టు తేలిందని వెల్లడి
  • ఇప్పటి వరకు 9 విడతల కీమోథెరపీ జరిగిందని వ్యాఖ్య
Actress Hamsa Nandini suffering with cancer

పలు తెలుగు సినిమాల్లో నటించి, మెప్పించిన కథానాయిక హంసానందిని 'మిర్చి', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాల్లో ఐటెం సాంగులతో కుర్రకారును హుషారెత్తించింది. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన హంసానందిని ఇప్పుడు క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు. కాసేపటి క్రితం ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా ఈ విషయాన్ని ఆమె తెలిపారు. తాను ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్నానని చెప్పారు. త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

తాను క్యాన్సర్ బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదని... భయంతో, ప్రతికూల భావాలతో జీవించబోనని హంస తెలిపారు. ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలనుకుంటున్నానని చెప్పారు. తన తల్లి 18 ఏళ్ల క్రితం క్యాన్సర్ తో కన్నుమూశారని... ఆ రోజు నుంచి తాను ఆ భయంతోనే జీవిస్తున్నానని తెలిపారు. నాలుగు నెలల క్రితం తనకు రొమ్ములో కణితి ఉన్నట్టు అనిపించిందని... వెంటనే డాక్టర్ ను సంప్రదించానని చెప్పారు. వైద్య పరీక్షల్లో రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్టు తేలిందని అన్నారు.

అయితే క్యాన్సర్ తొలి దశలోనే ఉందన్న తన ఆనందం ఎంతోసేపు కొనసాగలేదని... తనకు జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్టు దాక్టర్లు నిర్ధారించారని హంసానందిని తెలిపారు. వైద్యులు చెప్పినదాని ప్రకారం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం ఉందని... దీంతో సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకు 9 విడతల కీమోథెరపీ చేయించుకున్నానని... మరో 7 విడతల థెరపీలు చేయించుకోవాల్సి ఉందని అన్నారు.

క్యాన్సర్ మహమ్మారికి తన జీవితాన్ని బానిసగా చేయదల్చుకోలేదని... మహమ్మారిపై నవ్వుతూ పోరాడుతూ, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానని చెప్పారు. అందరిలో ప్రేరణను నింపడానికి ఈ విషయాన్ని చెపుతున్నానని తెలిపారు. హంసానందిని క్యాన్సర్ బారిన పడిందనే వార్తలతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

More Telugu News