Rahul Gandhi: ప్రజల కళ్లలో ఆగ్రహావేశాలు తప్ప అమేథీలో ఏ మార్పు లేదు: రాహుల్ గాంధీ

  • అమేథీలో రాహుల్ పర్యటన
  • సోదరి ప్రియాంకతో భారీ కవాతులో పాల్గొన్న రాహుల్
  • అమేథీలో ప్రతి వీధి అలాగే ఉందని వెల్లడి
Rahul Gandhi visits Amethi

తన పాత నియోజకవర్గం అమేథిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ కవాతులో రాహుల్ సోదరి, కాంగ్రెస్ పార్టీ యూపీ ఇన్చార్జి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ అమేథిలో పర్యటించడం ఇది రెండోసారి. అమేథి వచ్చిన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, అమేథీలో ప్రతి వీధి అలాగే ఉందని అన్నారు. ప్రజల కళ్లలో ప్రభుత్వంపై ఆగ్రహం తప్ప అమేథీలో  ఏ మార్పు లేదని వ్యాఖ్యానించారు.

"గతంలో మాదిరే ఇక్కడి ప్రజల హృదయాల్లో ఇప్పటికీ స్థానం ఉందని భావిస్తున్నాను. ఇప్పటికే మేం అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్యంగానే ఉన్నాం. 2004లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా తొలి ఎన్నికల్లో నేను పోటీ చేసింది అమేథీ నుంచే. రాజకీయాల గురించి ఇక్కడి ప్రజలు ఎంతో నేర్పించారు. రాజకీయాల సరళి ఎలా ఉంటుందో మీరు నాకు మార్గదర్శనం చేశారు. అందుకే ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని వివరించారు.  

గత లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం తెలిసిందే. అయితే అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమిపాలయ్యారు. అదే సమయంలో వాయనాడ్ లో మాత్రం విజయం సాధించారు.

More Telugu News