Madhya Pradesh: మ‌రోసారి టాయిలెట్లు క‌డిగిన మధ్యప్రదేశ్ మంత్రి.. ఫొటోలు వైర‌ల్

  • మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి ప్ర‌ధుమాన్ సింగ్ తోమ‌ర్ కు బాలిక ఫిర్యాదు
  • పాఠ‌శాల‌కు వెళ్లిన మంత్రి
  • గతంలోనూ ప్ర‌భుత్వ ఆఫీసులో టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి
  • ఓ సారి విద్యుత్ స్తంభం కూడా ఎక్కిన వైనం
Madhya Pradesh Energy Minister Pradhuman Singh Tomar cleaned the toilet of a govt school in Gwalior

మ‌ధ్య‌ప్ర‌దేశ్ విద్యుత్ శాఖ‌ మంత్రి ప్ర‌ధుమాన్ సింగ్ తోమ‌ర్ టాయిలెట్లు క‌డిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియర్ లోని త‌మ పాఠ‌శాల‌లో టాయిలెట్లు ప‌రిశుభ్రంగా ఉండ‌డం లేదంటూ ఓ బాలిక ఇటీవ‌ల మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పాఠ‌శాల‌కు వెళ్లిన మంత్రి తోమ‌ర్ స్వ‌యంగా పైపుతో నీళ్లు పోస్తూ టాయిలెట్ల‌ను క‌డిగి శుభ్రం చేశారు.

త‌ద్వారా పాఠ‌శాల‌లలోని టాయిలెట్ల‌ను శుభ్రంగా ఉంచ‌ని సిబ్బంది సిగ్గుపడేలా బుద్ధి చెప్పారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, పాఠ‌శాల‌లలోని టాయిలెట్ల‌ను సిబ్బంది ప‌రిశుభ్రంగా ఉంచ‌డం లేద‌ని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తాజాగా ఓ విద్యార్థిని త‌న‌కు తెలిపింద‌ని చెప్పారు. దీంతో తానే అక్క‌డ‌కు వెళ్లి వాటిని క‌డిగాన‌ని అన్నారు.

ఇక మంత్రి చేసిన ప‌నిపై నెటిజన్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కాగా, ప్రధుమన్ సింగ్ తోమర్ ఇటువంటి ప‌నులు చేసి శ‌భాష్ అనిపించుకోవ‌డం ఇది కొత్తేం కాదు. గ్వాలియర్ నియోజకవర్గంలోని బిర్లానగర్లో ఆయ‌న ఇటీవ‌లే పరిశుభ్రత డ్రైవ్ చేపట్టి 16వ వార్డులోని మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు.

అంతేగాక‌, కొన్ని రోజుల క్రితం గ్వాలియ‌ర్ లోని ఓ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో టాయిలెట్లు అప‌రిశుభ్రంగా ఉన్నాయ‌ని ఫిర్యాదు రావ‌డంతో అక్క‌డ‌కు వెళ్లి వాటిని కూడా క‌డిగారు. అప్ప‌ట్లో ఆయా ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ ప‌నులే కాదు.. కొన్ని నెల‌ల క్రితం హైటెన్ష‌న్ విద్యుత్ స్తంభం ఎక్కి దానిపై ఉన్న చెత్త‌ను శుభ్రం చేశారు. అప్ప‌ట్లో ఆ వీడియో కూడా బాగా వైర‌ల్ అయింది.

More Telugu News