Typhoon: ఫిలిప్పీన్స్ లో వేగంగా కదులుతున్న ‘రాయ్’ తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు.. ఫొటోలు ఇవిగో!

  • అతలాకుతలమైపోయిన ఫిలిప్పీన్స్
  • సూపర్ టైఫూన్ గా అభివర్ణించిన అమెరికా
  • ‘కేటగిరి 5’లో చేర్చిన ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ
  • ప్రస్తుతం బలహీనపడిందన్న అధికారులు
  • టబ్బులో పెట్టి నెల చిన్నారిని కాపాడిన అధికారులు
Typhoon Rai Pummeled Central Philippines

ఫిలిప్పీన్స్ ను ‘రాయ్’ తుపాను కకావికలం చేసేసింది. 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ ఏడాది 15 తుపాన్లు ఫిలిప్పీన్స్ పై విరుచుకుపడగా.. ఇదే అత్యంత శక్తిమంతమైన తుపాను అని అధికారులు చెబుతున్నారు. ఈ తుపానును అమెరికా ‘సూపర్ టైఫూన్’గా అభివర్ణించింది. ‘రాయ్’ను ‘కేటగిరీ 5’ తుపానుగా ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యంత వేగంగా కదులుతున్న ఈ తుపాను ప్రస్తుతం బలహీనపడిందని పేర్కొంది.
తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు ఇవాళ ఒకరు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. టైఫూన్ తో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆహారం, నీళ్లు లేక జనం అలమటించారు. వాతావరణ శాఖ అప్రమత్తం చేయడంతో వేలాది మంది ముందే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాము ఉంటున్న ప్రదేశం నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. విసాయా–పలావాన్ దీవుల మధ్య ఉన్న 8 ప్రాంతాల్లోని 3 లక్షల మందిని తరలించారు.

అయితే తుపాను తీవ్రత ఎక్కువగానే ఉన్నా ఇంతకుముందు వచ్చిన తుపాన్లతో పోలిస్తే రాయ్ తో కలిగే నష్టం తక్కువగానే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వరదల్లో చిక్కుకున్న నెల పసికందును టబ్బులో పెట్టి అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం తుపానుతో 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారు.

More Telugu News