KIA: త్వరలో భారత మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్న కియా 'కరెన్స్'

  • ఎంపీవీ సెగ్మెంట్లో భారత్ లోకి మరో మోడల్
  • కొరియాలో ఇప్పటికే పరుగులు తీస్తున్న రోండో
  • రోండోకు కరెన్స్ గా పునఃనామకరణం చేసిన కియా
  • పలు వేరియంట్లలో కరెన్స్
KIA set to bring Carens MPV into India

కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా భారత్ మార్కెట్లోనూ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే ఎంపీవీ (మల్టీపర్పస్ వెహికిల్) సెగ్మెంట్లో కరెన్స్ మోడల్ కారును ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్ ను కియా నేడు భారత మార్కెట్ కు పరిచయం చేసింది.  

వాస్తవానికి కరెన్స్ కొత్త మోడల్ ఏమీ కాదు. ఇది 1999 నుంచి కొరియా రోడ్లపై పరుగులు తీస్తోంది. దీన్ని కియా రోండో అని పిలిచేవారు. ఈ మోడల్ కు కరెన్స్ అని పునఃనామకరణం చేసిన కియా... తొలిగా భారత్ కు తీసుకువస్తోంది.

ఆధునిక తరం భారతీయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుకు మెరుగులు దిద్దారు. ప్రధానంగా ఇది సెవెన్ సీటర్. కారు ఇంటీరియర్ విశాలంగా ఉంటుంది. మూడు వరుసల్లో సీట్లు ఉంటాయి. కియా ఐకానిక్ సెల్టోస్ ప్లాట్ ఫామ్ పై కరెన్స్ ను ఉత్పత్తి చేస్తున్నారు. స్ప్లిట్ లైటింగ్ సెటప్ తో కూడిన ఎల్ఈడీ లైట్లు, హెడ్ ల్యాంప్స్, బలమైన ఫ్రంట్, రియర్ బంపర్లు, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తో అవుట్ లుక్ ఆకర్షణీయంగా ఉంది.

డ్యాష్ బోర్డులో గందరగోళానికి తావివ్వని రీతిలో కొన్ని బటన్లు మాత్రమే పొందుపరిచారు. త్రీ స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్, వైర్ లెస్ చార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సాఫ్ట్ వేర్ లతో కనెక్టివిటీ, మూడ్ కి తగిన లైటింగ్ ఏర్పాట్లు, సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగులు, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, కొండప్రాంతాల్లో ఘాట్ రోడ్లపై ప్రయాణించేందుకు హిల్ అసిస్టెంట్, 1.4 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ దీంట్లో ప్రత్యేకతలు.

స్టాండర్డ్ మోడల్ లో 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ పొందుపరిచారు. అయితే టర్బో పెట్రోల్ వెర్షన్ లో మాత్రం 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటో ట్రాన్స్ మిషన్  పొందుపరిచినట్టు  తెలుస్తోంది. దీని ధర వివరాలు ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News