Botsa Satyanarayana: తిరుపతిలో రేపు జరిగేది రాజకీయ సభ: రైతుల పాదయాత్రపై బొత్స వ్యాఖ్యలు

  • ముగిసిన మహా పాదయాత్ర
  • రాజధాని నుంచి తిరుపతికి పాదయాత్ర
  • శుక్రవారం తిరుపతిలో సభ
  • పాదయాత్రలో పాల్గొన్నది టీడీపీ వాళ్లేనన్న బొత్స
Botsa comments on Farmers meeting in Tirupati

ఏపీ రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతి చేరుకున్న రైతులు రేపు (శుక్రవారం) సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తిరుపతిలో రేపు జరిగేది రాజకీయ సభేనని వ్యాఖ్యానించారు.

విజయవాడ నుంచి తిరుపతి వరకు జరిగిన పాదయాత్రలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సానుభూతిపరులేనని అన్నారు. సభలో పాల్గొనాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పత్రికాముఖంగా పంపిన లేఖ చూస్తుంటే రేపటి సభను రాజకీయ సభ అనాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎందుకీ దోబూచులాటలు, దొంగాటలు, ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు? అంటూ బొత్స టీడీపీ నేతలను ప్రశ్నించారు.

అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లోని ఓ సామాజిక వర్గం బాగు కోసమే వారి తాపత్రయం అని విమర్శించారు. ఈ ఒక్క ప్రాంతం, ఒకే ఒక్క సామాజిక వర్గం అభివృద్ధి చేయడం టీడీపీ, చంద్రబాబు అజెండా అని ఆరోపించారు. కానీ, తమ ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నారని బొత్స కొనియాడారు.

"త్యాగాలు చేశారని చంద్రబాబు అంటున్నారు... నాగార్జునసాగర్ డ్యామ్ కడితే వేలమంది రైతులు భూములిచ్చారు. పోలవరానికి కూడా పెద్ద సంఖ్యలో భూములు ఇచ్చారు. అవి త్యాగాలు కాదా? అంతేతప్ప, ఓ సామాజిక వర్గం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రూపొందించిన ఈ కార్యక్రమం త్యాగం అవుతుందా?... దీన్నేమంటారో చంద్రబాబు చెప్పాలి" అని బొత్స వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News