Team India: అలీబాగ్‌లో నాలుగు ఎకరాల భూమిని రూ. 9 కోట్లకు కొనుగోలు చేసిన రోహిత్ శర్మ

  • భార్య పేరుపై కొనుగోలు 
  • రిజిస్ట్రేషన్ పూర్తికాగానే పూజలు
  • కథనాన్ని ప్రచురించిన ‘ముంబై మిర్రర్’
  • ప్రస్తుతం ఎన్‌సీఏలో కోలుకుంటున్న వన్డే కెప్టెన్
  • సచిన్, కోహ్లీకి ఇప్పటికే అలీబాగ్‌లో ఫామ్‌హౌస్‌లు
Rohit Sharma buys farmhouse property in Alibaug

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణ ముంబైలోని అలీబాగ్‌లో నాలుగు ఎకరాల స్థలాన్ని రూ. 9 కోట్లకు కొనుగోలు చేశాడు. రోహిత్ ఆ భూమిని తన భార్య రితిక పేరిట కొనుగోలు చేశాడని, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూమిలో చిన్నపాటి పూజ చేశారని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా గతంలోనే ఇక్కడ భూమిని కొనుగోలు చేశారు.

ముంబైకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్‌ సుందరమైన బీచ్‌లతో అత్యద్భుతంగా ఉంటుంది. టూరిస్ట్ హాట్ స్పాట్ కూడా. ముంబై  సంపన్నుల్లో చాలామందికి ఇక్కడ ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో కోహ్లీ ఇక్కడ తనకున్న ఫామ్‌హౌస్‌లోనే భార్య అనుష్కతో గడిపాడు. గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న రోహిత్.. కోలుకుంటున్నాడు.

అక్కడి నుంచే ఒక రోజు అలీబాగ్ వెళ్లిన రోహిత్ డీల్ ఫైనలైజ్ చేసుకున్నాడని ‘ముంబై మిర్రర్’ గతంలో ఓ కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా స్థానికులతో అతడు మాట్లాడుతున్న ఫొటోలను కూడా ప్రచురించింది. ఎన్‌సీఏ నుంచి రోహిత్ బయటకు వెళ్లడంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. అతడు ఒక రోజు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నాయి. అయితే, రోహిత్ సన్నిహితుడు ఒకరు మాత్రం ఈ విషయమై నిర్ధారించేందుకు నిరాకరించాడు. ఆ రోజున తాను అతడితో వెళ్లలేదని, కాబట్టి నేరుగా రోహిత్‌నే ఆ విషయం అడిగి తెలుసుకోవాలని సూచించాడు.

More Telugu News