క్రిప్టో కరెన్సీ కేసు.. తెలంగాణ పోలీసుల అదుపులో కృష్ణా జిల్లా సర్పంచ్
- క్రిప్టో కరెన్సీలో రూ. 70 లక్షల వరకు పెట్టుబడులు
- నష్టం రావడంతో భాగస్వాముల డబ్బు, బంగారం, కార్లు స్వాధీనం
- ఒత్తిడి భరించలేక ఖమ్మంకు చెందిన భాగస్వామి ఆత్మహత్య
- అప్పటి నుంచి పరారీలో లక్ష్మణరావు
సర్పంచ్ లక్ష్మణరావు దాదాపు రూ. 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. లాభాల మాట దేవుడెరుగు పెట్టుబడి కూడా రాకపోవడంతో భాగస్వాములను లక్ష్మణరావు ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండతో భాగస్వాములను పెనుగంచిప్రోలు పిలిపించిన లక్ష్మణరావు.. వారి నుంచి డబ్బులు, బంగారం, కార్లు బలవంతంగా లాక్కున్నారు. దీంతో గత నెల 23న రామలింగస్వామి సూర్యాపేట లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శివాపురం సర్పంచ్ లక్ష్మణరావు డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అంతకుముందు రాసిన సూసైడ్ నోట్లో రామలింగస్వామి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సూర్యాపేటలో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మణరావును గత రాత్రి తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని సూర్యాపేట తీసుకొచ్చారు. అయితే, ఆయనను అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.