Narendra Modi: ప్రధాని మోదీ కార్యక్రమాన్ని మేం ప్రసారం చేయలేదని ఆరోపించడం బాధాకరం: టీటీడీ

  • వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ
  • వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వైనం
  • ఎస్వీబీసీ3, ఎస్వీబీసీ4 చానళ్లలో ప్రసారం చేశామన్న టీటీడీ
  • కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడి
TTD statement on Modi Varanasi program live coverage

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తెలిసిందే. అయితే దివ్య కాశి భవ్య కాశి పేరిట సాగిన మోదీ పర్యటనను ఎస్వీబీసీ చానళ్లలో ప్రసారం చేయలేదని కొందరు మీడియా ద్వారా ఆరోపించడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. టీటీడీపై బురద చల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వీటిని తాము ఖండిస్తున్నామని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

దివ్య కాశి భవ్య కాశి కార్యక్రమాన్ని ఎస్వీబీసీ3, ఎస్వీబీసీ4 చానళ్లలో పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేశామని, శ్రీవారి కల్యాణోత్సవం తర్వాత తెలుగు ఎస్వీబీసీ చానల్లోనూ మోదీ కార్యక్రమం ప్రసారమైందని టీటీడీ వివరణ ఇచ్చింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇటువంటి సున్నితమైన అంశాలపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని హితవు పలికింది. ఆధ్యాత్మిక సంస్థపై అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వడం మంచిదికాదని పేర్కొంది.

More Telugu News