Harsha Kumar: జగన్ చెల్లెలు కులాంతర వివాహం చేసుకుంటే పర్లేదు.. ఇతరులు చేసుకుంటే కక్ష ఎందుకు?: మాజీ ఎంపీ హర్షకుమార్‌

  • ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదు
  • రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్న దళిత యువకుడిని వేధిస్తున్నారు
  • కులాంతర వివాహాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను జగన్ ఆపేశారు
Jagan is against to Dalits says Harsha Kumar

వైసీపీ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు కులాంతర వివాహం చేసుకున్నా పర్వాలేదని... అయితే ఇతరులు ప్రేమ వివాహం చేసుకుంటే వారిపై కక్ష ఎందుకని ప్రశ్నించారు.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒంగోలుకు చెందిన దళితుడైన వినోద్ కుమార్ ను పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్డి కులానికి చెందిన అమ్మాయిలను దళితులు ప్రేమ వివాహం చేసుకోకూడదనే ఉద్దేశంతో కులాంతర వివాహాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను జగన్ ఆపేశారని దుయ్యబట్టారు.  

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నాన్చుడు ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందని హర్షకుమార్ అన్నారు. దళితులను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీలో ఉన్న దళిత నేతలంతా సమావేశమై.. దళితులపై జరుగుతున్న వివక్షపై జగన్ ను నిలదీయాలని అన్నారు.

విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్ షిప్ లను కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజమండ్రి ఎయిర్ పోర్టును వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని యోచిస్తుండటం సిగ్గుచేటని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద జనసేనాని పవన్ కల్యాణ్ దీక్ష చేస్తే బాగుంటుందని చెప్పారు.

More Telugu News