పార్లమెంటు సమావేశాలను బహిష్కరించడానికి కారణం ఇదే: టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు
- కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం
- ధాన్యం కొనుగోళ్లపై నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదు
- రైతులకు న్యాయం జరగడం లేదనే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాం
9 మంది లోక్ సభ, 7 గురు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై గత ఏడు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని... కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెపుతోందని... రబీ సీజన్ లో ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని, వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుందని, అందుకే రబీలో పండే ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా మారుస్తామని కేకే చెప్పారు. బాయిల్డ్ రైస్ ను కొంటారో, లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వడం లేదని... డొంక తిరుగుడు సమాధానాలను చెపుతోందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం జరగడం లేదనే కారణంతోనే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. సమస్యను పరిష్కరించకుండా బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.