Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు

Raghurama Krishna angry on AP Govt
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? రాస్కెల్స్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీతో అంటకాగిందే వైసీపీ నేతలని ఆరోపించారు. ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో విజయసాయిరెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వ దాష్టీకాలమీద పోరాటం చేస్తున్నందుకు తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులు అమరావతి కోసం భూములిస్తే.. విశాఖపట్నంలో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. అమరావతి నుంచి ఒక్కొక్క కార్యాలయాన్ని తరలిస్తున్నారని మండిపడ్డారు. దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా రైతులు ఉద్యమం చేస్తున్నారని అన్నారు. పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ మండిపడ్డారు. దౌర్జన్యపు సైన్యంలా వలంటీర్ వ్యవస్థ ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని రఘురామ అన్నారు. రాజ్యాంగ విరుద్ధమని చెబితే తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చరిత్రలో జగన్ కూడా గుర్తుండిపోతారని, ఎప్పుడైనా విలన్, హీరోలందరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు.. అంతా గుర్తున్నా వారి వారి చర్యలకు తగ్గట్టు గుర్తుండిపోయారన్నారు. జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్, జార్ చక్రవర్తి తరహాలోనే దుర్మార్గుడి జాబితాలో గుర్తుండిపోతారనే తనబాధంతా అని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Raghu Rama Krishna Raju
YSRCP
YS Jagan

More Telugu News