hyderabad: హైదరాబాదుకు విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్

  • నిన్న, ఈరోజు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు
  • యూకే, యూఎస్, కెనడా, సింగపూర్ నుంచి రాక
  • టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్న అధికారులు
12 persons came from abroad to Hyderabad tested positive

ఓవైపు ఒమిక్రాన్ భయాలు జనాలను వెంటాడుతున్నాయి. మరోవైపు విదేశాల నుంచి వస్తున్న వారిలో బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులు జనాల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా విదేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన ప్రయాణికుల్లో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరంతా నిన్న, ఈరోజు కెనడా, యూకే, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చారు. వీరందరిని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. అయితే వీరందరికీ అసింప్టొమేటిక్ లక్షణాలు ఉండటం గమనార్హం. వీరి రిపోర్టుల్లో ఒమిక్రాన్ నిర్ధారణ కాకపోతే హోం ఐసొలేషన్ కు పంపిస్తారు.

మరోవైపు కుత్బుల్లాపూర్ సమీపంలో ఉన్న రిడ్జ్ టవర్స్ కు చెందిన 36 ఏళ్ల మహిళ లండన్ నుంచి వచ్చింది. ఎయిర్ పోర్టులో నిర్వహించిన కొవిడ్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. అయితే ఆ తర్వాత రిపోర్ట్స్ ను పరిశీలిస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే జీడిమెట్ల పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే సీఐ బాలరాజు రిడ్జ్ టవర్స్ అసోసియేషన్ కమిటీకి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా అక్కడకు చేరుకుని విషయాన్ని సదరు మహిళకు వివరించి, టిమ్స్ కు తరలించారు. ఆమె తల్లిదండ్రులను హోమ్ క్వారంటైన్ లో ఉంచారు.

More Telugu News